సైబర్ నేరస్థులు రోజుకో కొత్త వేషం వేస్తున్నారు.. రకరకాల పద్ధతుల్లో ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఏంజరిగిందో తెలుసుకునేలోపే బ్యాంకు ఖాతాలను ఊడ్చేస్తున్నారు. సైబర్ మోసాలపై జనాల్లో అవగాహన పెరుగుతున్నకొద్దీ మరో కొత్త పద్ధతిలో దోచుకుంటున్నారు. తాజాగా ‘కాల్ మెర్జింగ్’ పేరుతో సరికొత్త మోసానికి తెరలేపారని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కేవలం ఒక్క నిమిషంపాటు మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ ఖాతాను ఖాళీ చేస్తున్నారు. ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల వివరాలు వివిధ మార్గాల్లో సేకరించి పక్కాగా స్కెచ్ వేస్తున్నారు. రాంగ్ కాల్ కావొచ్చని సరిపెట్టుకునేలోపే బ్యాంకుల నుంచి వచ్చే మెసేజ్ లతో జరిగిన మోసం అర్థమవుతుంది.
ఏమిటీ కాల్ మెర్జింగ్ స్కామ్..?
ముందుగా పాత స్నేహితుడినంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మీ కాంటాక్ట్ లోని ఓ వ్యక్తి పేరు చెప్పి మనం మనం స్నేహితులమని, పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తారు. ఆ తర్వాత సదరు స్నేహితుడితో మాట్లాడదామని, తనతో కాల్ చేయిస్తా కాన్ఫరెన్స్ పెట్టండని కోరుతారు. కొద్ది క్షణాల్లో మీకు మరో కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసి కాన్ఫరెన్స్ లో పెట్టగానే ఓటీపీ వినపడుతుంది. అంతే.. ఆ తర్వాత కాల్ కట్ అవుతుంది.
వాస్తవానికి జరిగేది ఏంటంటే.. మీకు ఫోన్ చేసిన సైబర్ నేరస్థుడు ముందే మీ క్రెడిట్ కార్డు వివరాలు లేదా బ్యాంక్ ఖాతా వివరాలను షాపింగ్ సైట్ లో ఎంటర్ చేసి సిద్ధంగా ఉంటాడు. ఓటీపీ వివరాలను కాల్ లో చెప్పే ఆప్షన్ ఎంచుకుంటాడు. దీంతో బ్యాంక్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఆ కాల్ మీ స్నేహితుడిదని నమ్మించి కాల్ మెర్జింగ్ చేయమని సైబర్ నేరస్థుడు అడుగుతాడు. అది నమ్మి కాల్ మెర్జ్ చేయగానే ఓటీపీ నెంబర్ వినబడుతుంది. దానిని గ్రహించాక సైబర్ నేరస్థుడు ఫోన్ పెట్టేస్తాడు. ఓటీపీని ఎంటర్ చేసి షాపింగ్ పూర్తిచేస్తాడు. దీంతో షాపింగ్ చేసిన వస్తువులేమో సైబర్ నేరస్థుడికి, దాని తాలూకా బిల్లేమో మీకు అందుతాయి.
ఏంచేయాలి.. ఏం చేయొద్దు..?
కాల్ మెర్జింగ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కాల్ మెర్జింగ్ చేయాలని అడిగితే విడిగా మాట్లాడతానని చెప్పి కాల్ కట్ చేయాలి. ఒకవేళ కాల్ మెర్జింగ్ చేస్తే మొదటి కాల్ ను హోల్డ్ లో పెట్టాలి. దీనివల్ల బ్యాంకు నుంచి వచ్చే ఫోన్ కాల్ సంభాషణను సైబర్ నేరస్థుడు వినలేడు. ఓటీపీ వివరాలు తెలుసుకునే అవకాశం ఉండదు. దీంతో బ్యాంకు ఖాతాలోని మీ సొమ్ము భద్రంగా ఉంటుంది