షూటింగ్ పూర్తయిన 37 ఏళ్ల తర్వాత విడుదల అవుతున్న రజనీకాంత్ సినిమా

V. Sai Krishna Reddy
1 Min Read

దశాబ్దాల క్రితం చిత్రీకరణ జరుపుకుని ఆగిపోయిన ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రజనీకాంత్, శత్రుఘ్న సిన్హా, హేమమాలిని, అమ్రిష్ పురి, జగదీప్ వంటి దిగ్గజ నటులు కలిసి నటించిన ‘హమ్ మే షాహెన్‌షా కౌన్’ అనే హిందీ చిత్రం ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. ఎన్నో ఏళ్లుగా పెట్టెలో మగ్గిపోయిన ఈ సినిమాను ఆధునిక సాంకేతికతతో పునరుద్ధరించి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

రాజా రాయ్ నిర్మించిన ఈ చిత్రానికి హర్మేష్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. సలీం-ఫైజ్ సంభాషణలు, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతం, ఆనంద్ బక్షి సాహిత్యం, సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ అందించారు. 35 ఎంఎం ఈస్ట్‌మన్ కలర్‌పై చిత్రీకరించినప్పటికీ, అప్పట్లో ఈ సినిమా సెన్సార్‌కు వెళ్లకపోవడంతో విడుదల ఆగిపోయింది.

ఈ ఆలస్యానికి ప్రధాన కారణం నిర్మాత రాజా రాయ్ జీవితంలో ఎదురైన ఓ పెను విషాదం. సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక లండన్‌కు వెళ్లిన ఆయన, అక్కడ తన చిన్న కుమారుడిని కోల్పోయారు. ఈ బాధ నుంచి కోలుకోలేక సినిమా పనులను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు దర్శకుడు హర్మేష్ మల్హోత్రా కూడా కన్నుమూయడంతో ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది.

అయితే, ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఈ సినిమాకు పునరుజ్జీవం పోశారు. ఏఐ టెక్నాలజీతో విజువల్స్, ఆడియో నాణ్యతను మెరుగుపరిచామని, 4K రిజల్యూషన్‌తో పాటు 5.1 సరౌండ్ సౌండ్‌తో సినిమాను సిద్ధం చేశామని అసోసియేట్ ప్రొడ్యూసర్ అస్లాం మీర్జా తెలిపారు. అయితే, సినిమా అసలు కథ, నటన వంటి ఆత్మను ఏమాత్రం మార్చలేదని ఆయన స్పష్టం చేశారు. “ఎన్నో విషాదాలను, అడ్డంకులను దాటుకుని ఈ సినిమా విడుదల కావడం విధిరాతగా భావిస్తున్నాను” అని నిర్మాత రాజా రాయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఒకప్పటి బాలీవుడ్ స్వర్ణయుగానికి ప్రతిబింబంగా నిలిచిన ఈ చిత్రం, ఇప్పుడు కొత్త హంగులతో ప్రేక్షకులను అలరించనుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *