తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పీఠం ఎవరిది? ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ

V. Sai Krishna Reddy
2 Min Read

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) 2025-27 కార్యవర్గ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్, మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, దిల్ రాజు నేతృత్వంలోని ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’, మరోవైపు సి. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

ఈ ఎన్నికల్లో మొత్తం 3,355 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో నిర్మాతల విభాగం నుంచి 1,703 మంది, డిస్ట్రిబ్యూటర్ల విభాగం నుంచి 631 మంది, ఎగ్జిబిటర్ల విభాగం నుంచి 916 మంది, స్టూడియో సెక్టార్ నుంచి 105 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా నాలుగు సెక్టార్లకు ఛైర్మన్‌లను, 44 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం ఎన్నికైన సభ్యులు ఛాంబర్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

నిబంధనల ప్రకారం, ఈసారి అధ్యక్ష పదవి ఎగ్జిబిటర్ల సెక్టార్‌కు కేటాయించబడింది. దీంతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరఫున డి. సురేష్ బాబు, మన ప్యానెల్ మద్దతుతో నట్టి కుమార్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. గత కమిటీ పదవీకాలం జులై 2025లోనే ముగియగా, ఆరు నెలల ఆలస్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సి. కళ్యాణ్ వంటి సీనియర్ నిర్మాతలు గట్టిగా డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుత పోలింగ్ ప్రక్రియకు మార్గం సుగమమైంది.

ఎన్నికల ప్రచారంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. ముఖ్యంగా, ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేరుతో కొందరు పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలను పట్టించుకోవడం లేదని, పరిశ్రమలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ‘మన ప్యానెల్’ ఆరోపించింది. ఓటీటీ విడుదల నిబంధనలు, కార్మికుల వేతనాల పెంపు వంటి అంశాలు ప్రచారంలో కీలకంగా మారాయి. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించి, సాయంత్రానికల్లా ఫలితాలను వెల్లడించనున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టే కార్యవర్గం ఎవరనే దానిపై పరిశ్రమలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *