తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు టైరు పేలి తొమ్మిది మంది మృతి

V. Sai Krishna Reddy
1 Min Read

చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచ్చి నుంచి చెన్నై వెళ్తున్న తమిళనాడు స్టేట్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (SETC) బస్సు టైరు పేలడంతో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

పోలీసుల కథనం ప్రకారం.. కడలూరు జిల్లా ఎళుత్తూరు సమీపంలో బస్సు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ముందు టైరు పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా సెంట్రల్ డివైడర్‌ను ఢీకొట్టి, అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న రెండు కార్లను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాద తీవ్రతకు రెండు కార్లు ఆనవాలు లేకుండా నుజ్జునుజ్జయ్యాయి. కార్లలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. మృతుల్లో కరూరుకు చెందిన ప్రముఖ బంగారు వ్యాపారి రాజరత్నం (69), ఆయన భార్య రాజేశ్వరి (57), డ్రైవర్ జయకుమార్ ఉన్నారు.

మరో కారులో ప్రయాణిస్తున్న పుదుక్కోట్టై వాసులు ముబారక్, తాజ్ బిర్కా, సిరాజుద్దీన్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. సిరాజుద్దీన్ తన బంధువును కెనడా పంపేందుకు చెన్నై ఎయిర్‌పోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల శిథిలాల మధ్య చిక్కుకున్న మృతదేహాలను వెలికితీయడం అధికారులకు కష్టతరంగా మారింది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది.

తమిళనాడులో ఇటీవల హైవేలపై జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాల ఫిట్‌నెస్, క్రమం తప్పకుండా నిర్వహణ పనులను పర్యవేక్షించకపోవడమే ఇలాంటి టైరు పేలుడు ఘటనలకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *