తెలంగాణలో 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న ఏపీ మహిళ

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ రాష్ట్రంలో 150 మద్యం దుకాణాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ దరఖాస్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో టెండర్లు భారీగా దాఖలయ్యాయి. శనివారం ఒక్కరోజే 30 వేలకు పైగా దరఖాస్తులు అందగా, మొత్తం సంఖ్య 90 వేలు దాటినట్లు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో మొత్తం 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం గత నెల 27న టెండర్ నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల గడువు ముగిసింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈ నెల 23న డ్రా ద్వారా లైసెన్సులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ ఏకంగా 150 దుకాణాలకు దరఖాస్తు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమె ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేయడం విశేషంగా మారింది.

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వ్యాపారులు, పెట్టుబడిదారులు, మహిళలు ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనడం రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *