కేటీఆర్, జగదీశ్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు… కోర్టును సమయం కోరిన తీన్మార్ మల్లన్న

V. Sai Krishna Reddy
1 Min Read

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డిలపై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఒక నకిలీ వీడియోను సృష్టించి, ప్రచారం చేశారంటూ తీన్మార్‌ మల్లన్న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మేడిపల్లి పోలీసులు కేటీఆర్, జగదీశ్‌ రెడ్డిలపై కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో జరిగిన విచారణలో కేటీఆర్, జగదీశ్‌ రెడ్డిల తరఫున న్యాయవాది రమణారావు తమ వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు సరికాదని, అవి తప్పుగా నమోదు చేయబడ్డాయని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసులు పేర్కొన్న సెక్షన్లకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు లేవని ఆయన వాదించారు.

అనంతరం, ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న తీన్మార్‌ మల్లన్న తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం, తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *