26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్థాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 100 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఇక, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు కూడా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడుల్లో హతమైన విషయం తెలిసింద. మసూద్ అజార్ ఫ్యామిలీకి చెందిన 14 మంది చనిపోయారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. భారత్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబీకులకు ఒక్కొక్కరికి కోటి ఇవ్వనున్నట్లు షరీఫ్ వెల్లడించారు. పాకిస్థాన్ పీఎంవో ప్రెస్ రిలీజ్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో మసూద్ అజార్కు నష్టపరిహారం కింద రూ. 14 కోట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి.
వైమానిక దాడుల్లో తన సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మరదలు, మరో ఐదుగురు చిన్నారులు మృతిచెందినట్లు మసూద్ అజార్ ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మసూద్ అజార్ ఫ్యామిలీలో ప్రస్తుతం అతనొక్కడే బ్రతికి ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో ప్రాణాలు కోల్పోయిన ఆ 14 మందికి అతనే వారసుడు కాబట్టి, పాకిస్థాన్ ప్రభుత్వం ఇచ్చే రూ. 14 కోట్లు అతనికే దక్కుతాయని అంచనా వేస్తున్నారు.
కాగా, ఆపరేషన్ సింధూర్లో భాగంగా బహవల్పుర్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత్ మే 7న దాడి చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్లోని 12వ అతిపెద్ద నగరం ఇది. జేషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఆపరేషన్ కేంద్రం ఈ నగరంలోనే ఉంది. లాహోర్కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో బహవల్పుర్ ఉంది. జామియా మజ్జీద్ సుభాన్ అల్లా లేదా ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అని కూడా ఈ ప్రాంతాన్ని పిలుస్తుంటారు.