దేశ రక్షణ కోసం ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ప్రాణాలర్పించిన వీర జవాన్, పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, కల్లితండాకు చెందిన మురళి నాయక్ (25) మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మురళి నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుఅమర జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రులు శ్రీమతి జ్యోతిబాయి, శ్రీ శ్రీరాం నాయక్లతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. పుత్రశోకంతో బాధపడుతున్న వారిని ఆయన ఓదార్చారు. అతి చిన్న వయసులోనే, కేవలం 25 ఏళ్లకే దేశం కోసం మురళి నాయక్ తన ప్రాణాలను త్యాగం చేశాడని పేర్కొన్నారు.
ఈ క్లిష్ట సమయంలో మురళి నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. వారి కుటుంబానికి తీరని లోటయినప్పటికీ, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని, మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు.