భారత్తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది.. రివేంజ్ పక్కా అంటూ చెప్పి మరి.. పాకిస్తాన్ కు నిద్రలేకుండా చేసింది.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ.. ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపుదాడులు చేస్తూ విరుచుకుపడింది. మొత్తం 9 ఉగ్రస్థావరాలు లక్ష్యంగా మిసైళ్ల వర్షం కురిపించింది.. 100 మందికిపైగా ఉగ్రవాదులను సమాధి చేసి పాకిస్తాన్ ను షాక్కు గురిచేసింది. దీంతో పాకిస్తానీలు వణికిపోతున్నారు. యుద్ధభయంతో ఎప్పుడు ఏం జరుగుతుందో.. భారత్ ఎక్కడ దాడి చేస్తుందోనన్న ఆందోళనతో బిక్కచచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.. పాక్ రెచ్చగొడితే తొక్కిపడేస్తాం.. అజిత్ దోవల్..
భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో మరోసారి తమ శక్తి యుక్తిలను చాటిచెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న సైన్యం.. పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్ నెక్ట్స్ స్టెప్ ఎంటి? అనేది ఉత్కంఠగా మారింది. అయితే.. బోర్డర్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి.. పాకిస్తాన్ కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి.. ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక ప్రకటన చేశారు. భారత్కు యుద్ధం చేసే ఆలోచన లేదు..కానీ పాక్ రెచ్చగొడితే తొక్కిపడేస్తాం.. అంటూ అజిత్ దోవల్ వార్నింగ్ ఇచ్చారు. విధ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (NSAs) తో సమావేశమైన ఆయన.. పాకిస్థాన్ కవ్విస్తే ప్రతీకార దాడులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇవాళ అఖిలపక్షం భేటీ..
ఇదిలాఉంటే.. ఉదయం 11 గంటలకు అఖిలపక్షం భేటీ జరగనుంది. రక్షణమంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ కొనసాగనుంది. పార్లమెంట్ కాంప్లెక్స్లోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ఆపరేషన్ సిందూర్ వివరాలు.. భారత్ పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధత విషయాలను అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించనుంది. ఉగ్రవాదుల కోసం వేట
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. 100 ఇళ్లలో భద్రతా సిబ్బంది సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు జరిపారు. అంతేకాకుండా ఎల్వోసీ గ్రామాల ప్రజలను కేంద్రం ఖాళీ చేయిస్తోంది. సామాన్య ప్రజలను టార్గెట్ చేసి.. పాక్ సైన్యం దాడి చేయడంతో అప్రమత్తమైన భారత్.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.