తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల్లో ఈ ఉదయం భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 22 మంది మావోయిస్టులు మరణించినట్లు అధికార వర్గాలు ప్రాథమికంగా వెల్లడించాయి. ప్రస్తుతం ఘటనా స్థలంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సమీపంలోని అటవీ ప్రాంతమైన కర్రెగుట్టలను లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు ఈ భారీ ఆపరేషన్ను చేపట్టాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), కోబ్రా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ (సీఏఎఫ్) కు చెందిన బలగాలు సంయుక్తంగా ఈ కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఈ కీలక ఆపరేషన్ను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) వివేకానంద సిన్హా స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది.
సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) రాకేశ్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందరరాజ్ లు ఎప్పటికప్పుడు ఆపరేషన్ పురోగతిని సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలోని బలగాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఎదురుకాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది