తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి జస్టిస్‌ మాటూరి గిరిజా ప్రియదర్శిని (61) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.. జస్టిస్‌ ప్రియదర్శిని భౌతికకాయాన్ని హఫీజ్‌పేటలోని ఆమె నివాసంలో ఉంచారు. అంత్యక్రియలు సోమవారం నాడు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోరు పాల్‌, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. 1995లో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన జస్టిస్‌ ప్రియదర్శిని, విశాఖపట్నంలో సివిల్‌, క్రిమినల్‌, లేబర్‌ లా, వైవాహిక వివాదాలకు సంబంధించి ఎన్నో కేసులను వాదించారు. 2008 నవంబర్‌లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా జిల్లా జడ్జిగా ఎంపికై న్యాయ సేవలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అదనపు జిల్లా జడ్జిగా సేవలందించారు. అనంతరం పదోన్నతి పొంది, 2022 మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీనియారిటీ ప్రకారం ఆమె 16వ స్థానంలో ఉన్నారు. వచ్చే ఏడాది ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది.

విశాఖపట్నం ఎన్‌బిఎం లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆమె, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి లేబర్‌ అండ్‌ ఇండిస్టియల్‌ లాలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. అంతకుముందు సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌లలో మాస్టర్స్‌ డిగ్రీలు కూడా పొందారు. శ్రీ మాటూరి అప్పారావు, శ్రీమతి నాగరత్నం దంపతులకు జన్మించిన ప్రియదర్శిని.. ఇంటర్మీడియట్ తర్వాత ఆమె డాక్టర్ కె. విజయ్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు.జస్టిస్‌ ప్రియదర్శినికి భర్త డాక్టర్‌ కె విజరు కుమార్‌, ఇద్దరు కుమారులు నిఖిల్‌, అఖిల్‌ ఉన్నారు. ఆమె తండ్రి అప్పారావు వాణిజ్య పన్నులశాఖ అధికారిగా పనిచేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *