అమరావతి సభకు భారీగా తరలి వస్తున్న ప్రజలు.. విజయవాడ బైపాస్‌పై భారీ సందడి

V. Sai Krishna Reddy
2 Min Read

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న జనంతో విజయవాడ పశ్చిమ బైపాస్ మార్గం కిటకిటలాడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బస్సులు, కార్లలో సభా స్థలికి చేరుకుంటున్నారు.

కృష్ణా జిల్లా చిన్నవుటపల్లి నుంచి రాజధాని గ్రామాలను కలిపేలా నిర్మించిన విజయవాడ వెస్ట్ బైపాస్, సుదూర ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చే ప్రజలకు ప్రధాన మార్గంగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి ప్రజలు ప్రత్యేక వాహనాల్లో తరలివస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఐదేళ్ల విరామం తర్వాత రాజధాని పనులు మళ్లీ ప్రారంభం కావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అధికారులు వెస్ట్ బైపాస్‌పై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి తాగునీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. లక్షలాది మంది ప్రజలు ఈ మార్గం గుండా ప్రయాణించే అవకాశం ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం నుంచి వచ్చిన పలువురు మాట్లాడుతూ, అమరావతి పనులు తిరిగి ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. “మా నాయకుడు చంద్రబాబు పిలుపు మేరకు, ప్రధాని మోదీ గారికి స్వాగతం పలకడానికి, అమరావతి నిర్మాణానికి మద్దతు తెలియజేయడానికి వచ్చాం. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండటం అత్యవసరం. ఈ ప్రభుత్వ హయాంలో, కేంద్ర సహకారంతో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని నమ్మకం ఉంది,” అని వారు అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో రాజధాని విషయంలో అనిశ్చితి నెలకొందని, ఇప్పుడు స్పష్టత రావడంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గతంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకున్న అమరావతి పనులు, మళ్లీ ఆయన సమక్షంలోనే పునఃప్రారంభం కానుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. వేలాది వాహనాలతో విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. అమరావతికి తరలివస్తున్న జన ప్రవాహం కొనసాగుతూనే ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *