పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన కారణంగా హైదరాబాద్ నుంచి దుబాయ్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. పాక్ తన గగనతలాన్ని మూసివేయడంతో ప్రయాణ సమయం పెరగడంతో పాటు టిక్కెట్ ధరలు కూడా భారంగా మారుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలపై ఏప్రిల్ 24వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నిషేధం విధించింది. దీనికి ప్రతిగా, భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్కు చెందిన విమానాలు భారత గగనతలం మీదుగా ప్రయాణించకుండా బుధవారం అర్ధరాత్రి నుంచి మే 23వ తేదీ వరకు నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
దూరం పెరగడంతోపాటు ఆర్థిక భారం
ఈ పరస్పర నిషేధాల ఫలితంగా హైదరాబాద్ నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులపై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్ప్రెస్ వంటి విమానయాన సంస్థలు హైదరాబాద్ నుంచి దుబాయ్, ఉత్తర అమెరికా, లండన్కు నడిపే సర్వీసుల షెడ్యూళ్లలో గురువారం నుంచి మార్పులు చేయాల్సి వచ్చింది. పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగించుకునే అవకాశం లేకపోవడంతో ఈ విమానాలను ప్రత్యామ్నాయ, సుదీర్ఘ మార్గాల్లో మళ్లిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు గంటన్నర నుంచి రెండున్నర గంటల వరకు అదనపు సమయం పడుతోంది. పెరిగిన ప్రయాణ దూరం, ఇంధన వ్యయం కారణంగా టికెట్ ధరలపైనా భారం పడుతోంది.
కొంతకాలం భారం తప్పదు
హైదరాబాద్ నుంచి దుబాయ్కి ఎమిరేట్స్, ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు ప్రతిరోజూ నేరుగా విమాన సర్వీసులు నడుపుతున్నాయి. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎప్పుడూ అధికంగా ఉంటుందని, సగటున 90 శాతం సీట్లు భర్తీ అవుతాయని విమానయాన సంస్థల ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఈ విమానాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నాయి.
భారత్, పాకిస్థాన్ మధ్య గగనతల మార్గాలపై ఆంక్షలు కొనసాగుతున్నంత కాలం, హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి పశ్చిమ దేశాలకు ప్రయాణించే వారు ఈ అదనపు సమయాన్ని, కొంతమేర ఆర్థిక భారాన్ని మోయక తప్పని పరిస్థితి నెలకొంది. విమానయాన సంస్థలు ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సర్వీసులను కొనసాగిస్తున్నాయి.