నెల్లూరు జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐదుగురు వైద్య విద్యార్థులు సహా మొత్తం ఆరుగురు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. కోవూరు మండలం పోతి రెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఈ విషాదం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు బుచ్చిరెడ్డిపాలెంలో తమ స్నేహితుడి సోదరి నిశ్చితార్థ వేడుకకు హాజరై కారులో తిరిగి వస్తున్నారు. పోతిరెడ్డిపాలెం సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. వేగంగా పలు పల్టీలు కొట్టిన కారు, రోడ్డు పక్కనే ఉన్న వెంకట రమణయ్య (50) అనే వ్యక్తి ఇంటిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వెంకట రమణయ్య అక్కడికక్కడే మృతి చెందారు.
కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఐదుగురు విద్యార్థులు మరణించారు. మృతులను జీవన్ చంద్రారెడ్డి (నెల్లూరు), నరేష్ నాయక్ (అనంతపురం), అభిషేక్ రాజ్ (అనంతపురం), అభిషాషి పురుషోత్తం (తిరుపతి), యగ్నేష్ (ప్రకాశం)గా గుర్తించారు. మరో విద్యార్థి నవనీత్ శంకర్ (కడప) ప్రస్తుతం చికిత్స పొందుతుండగా, అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఉన్న యువకుల ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, రహదారి భద్రతా చర్యలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు