పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనేనని, ఉగ్రవాదాన్ని పాక్ పెంచిపోషిస్తోందని భారత్ ఆరోపించింది. ఉగ్రవాదులకు, తద్వారా పాక్ కు గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లిన రాజ్ నాథ్.. పహల్గామ్ లో తాజా పరిస్థితిని, భద్రతా బలగాల సన్నద్ధతను వివరించినట్లు సమాచారం. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయన మోదీకి తెలియజేశారు.
అంతకుముందు, ఆదివారం నాడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహన్తో రాజ్నాథ్ భేటీ అయ్యారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఆ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రధానికి రాజ్ నాథ్ సింగ్ వివరించారు. ప్రధాని మోదీతో భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాల్గొన్నారు.
మధ్యాహ్నం మరో కీలక సమావేశం..
రక్షణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా సోమవారం సమావేశమయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ హౌస్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనున్నట్లు అధికార వర్గాల సమాచారం.