తెలంగాణ శాసనసభలో సిరిసిల్ల శాసనసభ్యుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అధికార పార్టీ నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో కేటీఆర్ మాట్లాడుతూ, పనులు కావాలంటే కాంగ్రెస్ నేతలు 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోందని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క స్పందిస్తూ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మండిపడ్డారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు, భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కమీషన్ తీసుకుంటున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని, లేదంటే సభలోనే క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. కేటీఆర్ గౌరవంగా మాట్లాడుతారని ఊహించానని, సభనే కాదు, రాష్ట్రాన్నే తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మైకు ఉందని ఇష్టారీతిన మాట్లాడవద్దని ఆయన అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
బీఆర్ఎస్ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. శాసనసభ్యుల ప్రవేశద్వారం వద్ద వారు నిరసనకు దిగారు. “20 శాతం, 30 శాతం కమీషన్ల పాలన”, “దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం” అంటూ నినాదాలు చేశారు