అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ అశోక్ నగర్ వెళ్లి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటినా ఆరువేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నాయకులు పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో నీళ్లు పాతాళానికి, నిధులు ఢిల్లీకి, నియామకాలు గాలికి పోయాయాని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడుకున్నామని, వాటి సాధన కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇంటింటికి నీళ్లు తెచ్చుకున్నామని, సాగునీటిని ఇచ్చి వ్యవసాయ విస్తరణ పెంచడం ద్వారా పంట దిగుబడి పెంచామని, లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.
నీళ్లు, నిధులు, నియామకాలకు కేసీఆర్ సంపూర్ణ న్యాయం చేశారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మీద కోపంతో సాగునీరు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు.