శాంతియుత వాతావరణంలో వినాయక చవితి నిర్వహించాలి

Rammoorthy Kamareddy
2 Min Read

శాంతియుత వాతావరణంలో వినాయక చవితి నిర్వహించాలి

అల్లర్లకు తావివ్వకుండా భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలి

విద్యుత్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి

డీజేలకు అనుమతి లేదు

– దేవునిపల్లి ఎస్సై రంజిత్‌

కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 12 (ప్రజా జ్యోతి)

కామారెడ్డి పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో వినాయక చవితి పండుగను ప్రశాంత, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పీస్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు, వివాదాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో పండుగను జరుపుకోవాలని దేవునిపల్లి ఎస్సై రంజిత్‌ సూచించారు.ఈ సందర్భంగా ఎస్సై రంజిత్‌ మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు, గ్రామ ప్రజలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఎలాంటి అల్లర్లు, వివాదాలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. గణేష్‌ మండపాల వద్దకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలను దృష్టిలో ఉంచుకుని గణేష్‌ మండపాల ఏర్పాటు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై తెలిపారు. ముఖ్యంగా విద్యుత్‌ వైర్లు, విద్యుత్‌ స్తంభాలు, తాత్కాలిక విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా అవసరమైన భద్రతా చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని పేర్కొన్నారు.చిన్నపిల్లలు గణేష్‌ మండపాల వద్దకు వచ్చినప్పుడు నిర్వాహకులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. వర్షాలు, విద్యుత్‌ సౌకర్యాలు, రద్దీ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.అలాగే వినాయక ఉత్సవాల సందర్భంగా డీజేలు ఏర్పాటు చేయవద్దని ఎస్సై రంజిత్‌ స్పష్టం చేశారు. శబ్ద కాలుష్యానికి తావివ్వకుండా పోలీసు శాఖ సూచనలు, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ పండుగను నిర్వహించాలని కోరారు. ఇతరులకు ఇబ్బందులు కలగకుండా, గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.గణేష్‌ మండపాల నిర్వాహకులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలంతా ఐక్యంగా, సోదరభావంతో కలిసి వినాయక చవితి వేడుకలను ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్సై రంజిత్‌ పిలుపునిచ్చారు.ఈ పీస్‌ కమిటీ సమావేశంలో దేవునిపల్లి ఏఎస్ఐ రామకృష్ణ, కానిస్టేబుల్ ఓం ప్రకాష్‌, వీడీసీ అధ్యక్షుడు కాసర్ల రవీందర్‌, గుడెల్లి గంగారం, ప్రతినిధులు ధ్యావారి నవీన్‌, నీట్టు లింగరావు, మరూకంటి స్వామి, అవుసుల గంగాధర్‌తో పాటు దేవునిపల్లి గ్రామ ప్రజలు, వివిధ గణపతి మండపాల అధ్యక్షులు, కార్యదర్శులు, నిర్వాహకులు, మండపాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *