నర్సాపూర్ (ప్రజాజ్యోతి) గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధిలో వార్డు సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలని నర్సాపూర్ ఎంపీడీవో మోఅజ్జమ్ హుస్సేన్ పిలుపునిచ్చారు. మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు చెందిన వార్డు సభ్యులకు ఐదు రోజుల పాటు నిర్వహించిన మూడవ విడత శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. వార్డు సభ్యులు తమ అధికారాలు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేసినప్పుడే గ్రామ వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులకు ఆయన చేతుల మీదుగా ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
