- సమీక్షా సమావేశంలో డిఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళిక’ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని డిఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని రైతు వేదికలో ఇన్చార్జి ‘ఎంపీడీవో మహమ్మద్ మోఅజ్జామ్ హుస్సేన్’ అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.
• ఇళ్లకు ప్రాధాన్యత.. తాగునీటిపై అప్రమత్తత: డిఆర్డీఓ
గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని శ్రీనివాస్ సూచించారు. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు ప్రతి అర్హత కలిగిన లబ్ధిదారుడికి చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.
• రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత: సిఐ
‘రోడ్డు భద్రత ప్రణాళిక’లో భాగంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ రెడ్డి కోరారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారానే ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు. అనంతరం తహసిల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ తారా సింగ్, ఏవో దీపిక మరియు వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. కార్యక్రమంలో ఏఈలు మల్లేశం, చంద్రశేఖర్, లక్ష్మీప్రసాద్, రమణమూర్తి, ఏపీఎం సంగమేశ్వర్, ఏవో అంజిరెడ్డితో పాటు సర్పంచులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
