కల్లెడలో ఎర్రి కుక్క దాడి.. యువకుడి వేళ్లు తెగిపోవడంతో కలకలం..
పర్వతగిరి, ఏప్రిల్ 07 (ప్రజాజ్యోతి)::
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిరుత సతీష్ ఉదయం పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి స్నానం చేస్తుండగా, అకస్మాత్తుగా ఒక ఎర్రి కుక్క అతనిపై దాడి చేసింది.
కుక్క ఒక్కసారిగా సతీష్ కుడి చేయి భుజాన్ని బలంగా కొరికింది. దాడితో కిందపడిపోయిన సతీష్పై మరింత ఉగ్రంగా విరుచుకుపడిన కుక్క, ఎడమ చేయి ఉంగరపు వేలిని గట్టిగా కొరికి తెంచేసింది. దీంతో వేలు పూర్తిగా తెగి కిందపడిపోయింది. సతీష్ అరుపులు విన్న గ్రామస్తులు, యువకులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కను తరిమికొట్టారు. తీవ్రంగా గాయపడిన సతీష్ను అత్యవసరంగా సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో భయం నెలకొంది. మరొకరు కుక్క కాటుకు బలి కాకూడదనే ఉద్దేశంతో గ్రామస్తులు ఆ ఎర్రి కుక్కను వెతికి చంపినట్లు సమాచారం. గ్రామంలో తిరుగుతున్న ఎర్రి కుక్కల సమస్యపై అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

