నకిలీ మానవ హక్కుల సంఘాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఉక్కుపాదం… రాష్ట్రాలకు ఆదేశాలు

V. Sai Krishna Reddy
1 Min Read

తమ పేరును పోలిన పేర్లతో రిజిస్టర్ అయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న నకిలీ సంస్థలు, వ్యక్తులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. ఇలాంటి సంస్థలపై దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని గురువారం స్పష్టం చేసింది.

ఇటీవల తమ దృష్టికి వచ్చిన ఓ ఘటనను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఉదహరించింది. ఢిల్లీ ప్రభుత్వంతో 2022లో ‘నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)’ పేరుతో ఓ ఎన్జీవో రిజిస్టర్ అయినట్లు ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఆ సంస్థ తమకు నీతి ఆయోగ్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖల గుర్తింపు ఉందని ప్రచారం చేసుకుంటోందని పేర్కొంది. కర్ణాటకకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ఈ సంస్థకు ‘స్టేట్ చైర్మన్’గా వ్యవహరిస్తున్నట్లు తేలిందని వెల్లడించింది.

ఈ వ్యవహారం తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కమిషన్, దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఇలాంటి మోసపూరిత పేర్లు ప్రజలను గందరగోళానికి గురిచేస్తాయని, ఈ సంస్థలు ఎన్‌హెచ్‌ఆర్‌సీలో భాగమని లేదా తమచే గుర్తింపు పొందాయని భ్రమ కల్పిస్తున్నాయని అభిప్రాయపడింది. ఇది ప్రజల్లో కమిషన్ పట్ల నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా, నిధుల దుర్వినియోగానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో పలుమార్లు హెచ్చరించినా, ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

ఈ నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేరును దుర్వినియోగం చేస్తున్న సంస్థలను గుర్తించి, వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతో పాటు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రత్యేకించి, ఢిల్లీలో రిజిస్టరై కర్ణాటకలో కార్యకలాపాలు సాగిస్తున్న సదరు నకిలీ సంస్థపై తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల ఉన్నతాధికారులను ఆదేశించింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *