* వీడిన ఉత్కంఠ కాంగ్రెస్ ఖాతాలో వర్ధన్నపేట మున్సిపాలిటీ
* వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ గా సారంగపాణి
వర్ధన్నపేట ఫిబ్రవరి 16, ప్రజా జ్యోతి::
వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠం పై ఉత్కంఠ వీడింది. మున్సిపాలిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ గా నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన ఐదవ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ నేతావత్ శిబారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ వార్డులు రాకపోవడంతో చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. 5వవార్డులో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన నేతావత్ శిభారాణి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ ఐదు వార్డులు,బిఆర్ఎస్ కు ఐదు వార్డులు సమానం కావడంతో ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎక్స్ అఫీషియో ఓటుతో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు బాంబులు పేల్చి, సంబరాలు చేసుకొని మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

