రేకుల షెడ్డులో రూ.1.5 కోట్ల బంగారం.. కూలీ ఇంట్లో బయటపడ్డ భారీ సంపద

V. Sai Krishna Reddy
1 Min Read

గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వృద్ధురాలి ఇంట్లో పోలీసులు భారీగా బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా వేయడంతో స్థానికంగా కలకలం రేగింది. రోజువారీ కూలి పనులు చేసుకునే ఆమె ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో సంపద బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. తెనాలి పట్టణంలోని మహేంద్ర కాలనీలో పేరిబోయిన గురవమ్మ అనే వృద్ధురాలు ఒక చిన్న రేకుల ఇంట్లో నివసిస్తోంది. గుంటూరు జిల్లాలో రైస్ పుల్లింగ్ వ్యవహారం జరుగుతోందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు పక్కా సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు డీఎస్పీ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురవమ్మ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, రూ. 5.65 లక్షల నగదు లభించాయి.

ఇంత పెద్ద మొత్తంలో బంగారం, డబ్బు ఎక్కడివని పోలీసులు గురవమ్మను ప్రశ్నించగా, అదంతా విజయవాడలో ఉండే తన అల్లుడిదని ఆమె బదులిచ్చింది. అతను భవానీపురంలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడని, అందులో భాగస్వామి అని, బాగా ఆస్తిపరుడని చెప్పింది. దీంతో పోలీసులు వెంటనే విజయవాడలోని ఆమె అల్లుడి ఇంటికి వెళ్లారు. అయితే, పోలీసుల రాకను ముందే పసిగట్టిన అతను అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ బంగారం నిజంగా అతని సంపాదనేనా? లేక అక్రమ మార్గాల్లో కూడబెట్టాడా? లేదా ఎవరైనా బడా పారిశ్రామికవేత్తలు అతన్ని బినామీగా వాడుకుంటున్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *