గ్రీన్‌ల్యాండ్‌పై యూటర్న్… మిత్రదేశాలపై టారిఫ్‌లను రద్దు చేసిన ట్రంప్

V. Sai Krishna Reddy
2 Min Read

గ్రీన్‌ల్యాండ్‌ను తమ దేశంలో విలీనం చేసుకునే విషయంలో తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. గ్రీన్‌ల్యాండ్‌ను తమకు అప్పగించాలంటూ యూరప్ మిత్రదేశాలను బెదిరించిన ఆయన, ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆర్కిటిక్ భద్రతకు సంబంధించి నాటోతో ఒక ‘భవిష్యత్ ఒప్పందానికి మార్గం’ సుగమమైందని, ఈ నేపథ్యంలో యూరప్ దేశాలపై విధించాలనుకున్న టారిఫ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో నాటో కూటమిలో తలెత్తిన తీవ్ర సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ… గ్రీన్‌ల్యాండ్ “హక్కు, టైటిల్, యాజమాన్యం” తమకు కావాలని, అయితే దాని కోసం సైనిక బలగాలను ఉపయోగించబోమని స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వల్లే యూరప్ నిలబడిందని, దశాబ్దాలుగా తాము చేసిన సాయంతో పోలిస్తే గ్రీన్‌ల్యాండ్‌ను అడగటం చాలా చిన్న విషయమని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ మాటలు నాటో కూటమి పునాదులను కదిలించేలా ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.

ఆర్కిటిక్ మహాసముద్రంలో రష్యా, చైనాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌ల్యాండ్ తమ నియంత్రణలో ఉండటం అత్యవసరమని ట్రంప్ చాలాకాలంగా వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రీన్‌ల్యాండ్‌ను అప్పగించని పక్షంలో డెన్మార్క్‌తో పాటు మరో ఏడు మిత్రదేశాలపై వచ్చే నెల నుంచి 10 శాతం, జూన్ నాటికి 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.

అయితే, డెన్మార్క్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మొదటి నుంచి గట్టిగా నిలబడింది. అమెరికా భద్రతాపరమైన ఆందోళనలపై చర్చకు సిద్ధమే కానీ, గ్రీన్‌ల్యాండ్ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ బెదిరింపులతో గ్రీన్‌ల్యాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ, ఐదు రోజులకు సరిపడా ఆహారం, నీరు, ఇంధనం వంటి నిత్యావసరాలను నిల్వ చేసుకోవాలని కోరింది. దీంతో అక్కడి ప్రజలు ఆందోళనతో దుకాణాలకు పరుగులు తీశారు.

తాజా పరిణామాలతో ట్రంప్ టారిఫ్‌ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ, ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు సాధించాలన్న ఆయన వ్యూహం మాత్రం మారలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. నాటోతో కుదిరిన ఫ్రేమ్‌వర్క్ డీల్ స్వరూపంపై స్పష్టత వస్తేనే ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగినట్లు భావించాలని వారు అభిప్రాయపడుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *