ట్రంప్ టారిఫ్‌ల భారం మోస్తూనే.. యూఎస్‌లో సత్తా చాటిన దక్షిణ కొరియా కార్ల కంపెనీలు

V. Sai Krishna Reddy
1 Min Read

అమెరికా ఆటోమొబైల్ మార్కెట్లో దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థలు హ్యుందయ్, దాని అనుబంధ సంస్థ కియా సరికొత్త రికార్డు సృష్టించాయి. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లను దూకుడుగా పెంచినప్పటికీ 2025లో ఈ రెండు కంపెనీలు కలిసి 11.3 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుని ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పాయి. గతేడాది అమెరికాలో హ్యుందయ్, కియా కలిపి మొత్తం 18.4 లక్షల వాహనాలను విక్రయించాయి.

మార్కెట్ రీసెర్చ్ సంస్థ వార్డ్స్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం హ్యుందయ్ 9,84,017 యూనిట్లతో 6.1 శాతం వాటాను, కియా 8,52,155 యూనిట్లతో 5.2 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. దీంతో అమెరికా మార్కెట్లో జనరల్ మోటార్స్ (17.5%), టయోటా (15.5%), ఫోర్డ్ (13.1%) తర్వాత ఈ గ్రూప్ నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం యూఎస్ మార్కెట్ 2.4 శాతం వృద్ధి చెందగా, హ్యుందయ్, కియా అమ్మకాలు 7.5 శాతం పెరగడం విశేషం.

స్థానికంగా ఉత్పత్తిని పెంచడం, హైబ్రిడ్ వాహనాల అమ్మకాలపై దృష్టి పెట్టడం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది హ్యుందయ్, కియా హైబ్రిడ్ వాహనాల అమ్మకాలు ఏకంగా 48.8 శాతం పెరిగి 3,31,023 యూనిట్లకు చేరాయి. యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం జార్జియాలో హ్యుందయ్ మూడో ప్లాంట్‌ను పూర్తి చేయడంతో స్థానిక ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. టారిఫ్ భారాన్ని వినియోగదారులపై మోపకుండా కంపెనీయే భరించడం కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడింది. ఈ వ్యూహం కారణంగా దక్షిణ కొరియా నుంచి అమెరికాకు వాహనాల ఎగుమతులు 4.2 శాతం తగ్గాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *