పంచాయతీ పోరులో విషాదాలు: తల్లీకూతుళ్ల పోటీ.. తల్లి ఆత్మహత్య

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు పలుచోట్ల ఉద్రిక్తతలకు, విషాదాలకు దారితీస్తున్నాయి. నామినేషన్ల విషయంలో తలెత్తిన కుటుంబ కలహాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేయగా, ఈ విషయమై ఇంట్లో జరిగిన గొడవతో తల్లి మందుల లక్ష్మమ్మ (40) ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, కడుపునొప్పి భరించలేకే ఆమె చనిపోయిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలోనూ చోటుచేసుకుంది. వార్డు మెంబర్‌గా నామినేషన్ వేసినందుకు భర్త మందలించడంతో లక్ష్మి అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.

 

మరోవైపు, తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల విషయంలో అధికార కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో ఏకగ్రీవమైన 20 పంచాయతీల్లో 19 కాంగ్రెస్ మద్దతుదారులకే దక్కాయి. నల్లగొండలో 20కి 17, సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే కొడంగల్ నియోజకవర్గ పరిధిలో 13 పంచాయతీలు కాంగ్రెస్ మద్దతుదారుల ఖాతాలో చేరాయి. మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నరసన్నపేట కూడా ఏకగ్రీవమయ్యాయి.

ఈ ఎన్నికలు కొన్ని కుటుంబాల్లో బంధాలను కూడా పరీక్షిస్తున్నాయి. జగిత్యాల జిల్లా గుమ్లాపూర్‌లో సర్పంచ్ పదవికి అన్న, చెల్లెలు పోటీ పడుతుండగా, మంచిర్యాల జిల్లా అల్లీపూర్‌లో తోడికోడళ్లు ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు.

ఇక, వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌ మండలంలో ఏకంగా నాలుగు పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కొన్నిచోట్ల సర్పంచ్ పదవులను వేలం వేస్తుండగా, మరికొన్ని గ్రామాల్లో రిజర్వేషన్లపై నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నారు. ఓటు హక్కు కోసం హైకోర్టుకు వెళ్లి నామినేషన్ వేసిన మహిళ అభ్యర్థిత్వాన్ని అధికారులు తిరస్కరించడంతో ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మొత్తంగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రకరకాల పరిణామాలతో కొనసాగుతోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *