ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాహుల్ మాట్లాడుతున్నారని ఈసీ వ్యాఖ్యానించింది.
ఈ మేరకు ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్ విధానంలో ఓట్లను నేరుగా తొలగించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఓటరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుని, క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాకే జాబితా నుంచి పేరును తొలగించడం జరుగుతుందని వివరించింది. ఈ ప్రక్రియ లేకుండా ఓట్లను తొలగించడం కుదరదని స్పష్టం చేసింది.
కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు జరిగిందన్న రాహుల్ ఆరోపణలపై కూడా ఈసీ స్పందించింది. వాస్తవానికి, 2023లో ఆ నియోజకవర్గంలో జరిగిన అక్రమాలను గుర్తించి, బయటపెట్టిందే తామని గుర్తుచేసింది. ఓట్ల తొలగింపునకు కొందరు ప్రయత్నించిన ఘటనపై తామే స్వయంగా కేసు నమోదు చేయించి ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని తెలిపింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ను రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. అలంద్లో ఘటన జరిగి ఏడాది గడిచిందని, కానీ జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా బాధ్యతలు చేపట్టి కేవలం ఆరు నెలలే అవుతోందని ఈసీ వర్గాలు గుర్తుచేశాయి. సంబంధం లేని విషయంలో ఆయనపై ఆరోపణలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డాయి.
