మాదాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. రూ.400 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

V. Sai Krishna Reddy
1 Min Read

హైదరాబాద్, మాదాపూర్‌లో ప్రభుత్వ భూములపై కన్నేసిన కబ్జాదారులకు హైడ్రా గట్టి షాక్ ఇచ్చింది. భారీ ఆపరేషన్ చేపట్టి, సుమారు రూ.400 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. శేరిలింగంపల్లి మండలం పరిధిలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో ఈ కూల్చివేతలు జరిగాయి. మొత్తం 16,000 చదరపు గజాల విస్తీర్ణంలోని అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు జేసీబీల సహాయంతో నేలమట్టం చేశారు.

ఈ స్థలంలో కబ్జాకు గురైన 8,500 చదరపు గజాల విస్తీర్ణంలోని రెండు పార్కులు, 5,000 చదరపు గజాల రోడ్లతో పాటు, 300 గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన హోటల్ షెడ్లను కూడా తొలగించారు. ‘ప్రజావాణి’ కార్యక్రమానికి వచ్చిన ఒక ఫిర్యాదు ఈ భారీ ఆపరేషన్‌కు కారణమైంది.

జూబ్లీ ఎన్‌క్లేవ్ లేఅవుట్‌లోని పార్కును జైహింద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆక్రమణలు నిజమేనని నిర్ధారించుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు గురువారం ఈ కూల్చివేతలను చేపట్టారు.

భూమిని స్వాధీనం చేసుకున్న అనంతరం, పార్కుల చుట్టూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ స్థలం అని తెలిపే బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ కబ్జాలకు పాల్పడిన వారిపై పోలీస్ కేసులు కూడా నమోదు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ లేఅవుట్‌కు 1995లో అనుమతులు రాగా, 2006లో ప్రభుత్వం దీనిని రెగ్యులరైజ్ చేసింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *