రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ గత రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోవడం తెలిసిందే. దాంతో, పోలీసులు నేడు అతడిని జడ్జి ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి, పూర్ణచందర్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని చంచల్గూడ జైలుకు తరలించారు.
స్వేచ్ఛ, పూర్ణచందర్ వారం రోజుల క్రితం ఇద్దరూ కలిసి అరుణాచలం వెళ్లి, మూడు రోజుల క్రితమే నగరానికి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ.. పూర్ణచందర్ తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకుని విగతజీవురాలిగా కనిపించింది. స్వేచ్ఛకు ఓ కుమార్తె ఉంది.