అహ్మదాబాద్ విమాన ప్రమాదం దెబ్బకు బుకింగ్స్లో 20 శాతం తగ్గుదల
ఎయిర్ ఇండియా టికెట్ ధరలు కూడా 8 నుంచి 15 శాతం తగ్గాయని సమాచారం
జులై 15 వరకు అంతర్జాతీయ షెడ్యూల్లో 15 శాతం కోత ఉంటుందన్న సీఈవో
అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియాకు ప్రయాణికులు షాకిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు వెలుగుచూస్తూ రద్దవుతున్న నేపథ్యంలో ఆ విమానాలవైపు చూడాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమాన బుకింగ్స్లో దాదాపు 20 శాతం క్షీణత నమోదైంది. మరోవైపు, నిన్న వివిధ కారణాలతో నాలుగు అంతర్జాతీయ సర్వీసులు సహా మొత్తం ఎనిమిది విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది.
బుకింగ్స్పై ప్రమాద ప్రభావం
గతవారం అహ్మదాబాద్లో జరిగిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా విమాన బుకింగ్స్పై తీవ్ర ప్రభావం పడిందని పర్యాటక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) ప్రకారం దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఎయిర్ ఇండియా బుకింగ్స్ సుమారు 20 శాతం తగ్గాయి. అంతేకాకుండా, సగటు టికెట్ ధరలు కూడా 8 నుంచి 15 శాతం వరకు తగ్గినట్టు తెలుస్తోంది. అలాగే, ఇతర విమానయాన సంస్థలతో పోటీ ఎక్కువగా ఉన్న కొన్ని రంగాల్లో టికెట్ ధరలు దాదాపు 10 శాతం వరకు తగ్గినట్టు తెలిసింది.