వాయువ్య ఉత్తరప్రదేశ్ దాని పరిసరాల నుంచి మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ఘడ్, మధ్య ఒడిస్సా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. సుమారు 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 4.5 కి.మీ ఎత్తులో గాలి విచ్ఛిత్తిగా మరొక ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో తెలంగాణలో పశ్చిమ, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. రాగల నాలుగు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే..
ఈ రోజు (జూన్ 11) గరిష్టంగా ఖమ్మంలో 36.4, కనిష్టంగా మెదక్లో 29.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మంగళవానం ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, భద్రాచలం లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.