దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణను హైకోర్టు ముగించింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి సంబంధించిన కేసులో తీర్పును వాయిదా వేసింది.
జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో గోపీనాథ్ తప్పుడు సమాచారం పొందుపరిచారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు అజహరుద్దీన్తో పాటు నవీన్ యాదవ్ వేర్వేరుగా ఈ పిటిషన్లను కోర్టులో దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న తరుణంలో, రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు. దీంతో, గోపీనాథ్పై దాఖలైన ఎన్నికల పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది.
కౌశిక్రెడ్డి పిటిషన్పై విచారణ పూర్తి, తీర్పు వాయిదా
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై సుబేదారీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై కూడా హైకోర్టులో విచారణ పూర్తయింది. క్వారీ వ్యాపారి మనోజ్ను రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్రెడ్డి బెదిరించినట్లు ఆరోపిస్తూ మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా, కౌశిక్రెడ్డి తరఫు న్యాయవాది రమణారావు వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ క్లయింట్పై ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే, డబ్బుల కోసం బెదిరించినందుకే పోలీసులు కేసు నమోదు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, ఈ పిటిషన్పై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.