తెలంగాణలో అధికారంలోకి వస్తామని.. వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే అధికారమని పదే పదే చెబుతున్న కమల నాథులకు పెద్ద ఇబ్బందులే వస్తున్నాయి. పార్టీలో నాయకులకు కొదవ లేదు. క్షేత్రస్థాయిలో కేడర్కు కూడా కొదవ లేదు. కానీ, నాయకులు.. కార్యకర్తల కలయిక.. కార్యక్రమాల నిర్వహణ వంటివి మాత్రం ఇప్పుడు పెను సమస్యలుగా మారుతున్నాయి. ఎందుకంటే.. నాయకులకు, కార్యకర్తలకు మధ్య సఖ్యత కనిపించడం లేదు.
అంతెందుకు.. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు(ఒకరు సహాయ) ఉన్నా.. కలివి ఏనాడూ కనిపించ లేదు. ఇద్దరూ కలిసిఒకే వేదికపై కూర్చుని పార్టీ గురించి చర్చించిన సందర్భం కూడా కనిపించదు. ఇక, ఎమ్మెల్యేలు, ఎంపీల సంగతి సరేసరి. ఇటీవల హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరిగిన ప్పుడు.. కొందరు కార్పొరేటర్లు.. గీత దాటారు. ఫలితంగా ఇటు పడాల్సిన ఓటు అటు పడింది. దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన నాయకులు .. తర్వాత ఈ విషయాన్ని మరిచిపోయారు
ఇక, పార్టీ రాష్ట్ర చీఫ్ పదవిని మార్చాలని.. మారుస్తామని అధిష్టానం పదే పదే చెబుతున్నా.. ఇప్పటి వరకు ఎవరినీ మార్చే ప్రయత్నం చేయలేకపోయింది. ఈ పరిణామం కూడా.. పార్టీలో కమల నాథులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. నిజానికి ఇప్పటికే రెండు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. సరైన నేత ఎంపిక మాత్రం వాయిదాపడుతోంది. దీనికి కారణం కూడా.. అంతర్గత ఆధిపత్య రాజకీయాలేనని తెలుస్తోంది. ఇది పార్టీలో బహిరంగంగానే వినిపిస్తున్న చర్చ.
మరోవైపు.. ఏ నలుగురు కలిసి కూర్చునే పరిస్థితి లేదు. పైగా ఎవరు నోరు విప్పినా.. నేతలపై విమర్శలు.. వివాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఏకంగా పార్టీ కార్యాలయాల్లో మీడియా సమావేశాలపై ఆంక్షలు.. కూడా విధించుకునే పరిస్థితి ఏర్పడింది. సో.. దీనిని ఎలా చూడాలి? ఏవిధంగా పార్టీని లైన్లో పెట్టాలి? అనేది ఇప్పటికీ కమల నాథులకు అంతుచిక్కని అంశంగానే మారింది. మరిఏం చేస్తా రో చూడాలి. ఏదేమైనా కమల నాథులకు అంతర్గత కుమ్ములాటలతో కంటిపై కునుకు కరువైందన్నది వాస్తవం.