రెండేళ్ల బాలుడి కిడ్నాప్ 3 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
* కామారెడ్డి జిల్లా ఎస్పీ
కామారెడ్డి ప్రజాజ్యోతి ప్రతినిధి( జూన్ 4.)
భిక్షాటన చేసేందుకు రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఓ జంట చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. కిడ్నాప్ ఘటన కామారెడ్డి పట్టణంలో బుధవారం చోటుచేసుకోగా పోలీసులు మూడు గంటల్లో కేసును ఛేదించారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. భిక్కనూరుకు చెందిన మక్కాల అనే వ్యక్తి భార్యా పిల్లలతో కామారెడ్డిలో భిక్షాటన చేస్తుంటాడు.రోజూ మాదిరిగానే మంగళవారం భిక్షాటన అనంతరం రాత్రి సిరిసిల్ల రోడ్డులో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద నిద్రించారు. అర్ధరాత్రి లేచి చూసేసరికి తమ కుమారుడు హర్షిత్ కనిపించకపోయేసరికి బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏఎస్పీ ఆధ్వర్యంలో సీఐ, ఎస్సైలు మూడు బృందాలుగా సీసీ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.ఓ జంట బాబును ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు వారిని కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద బాబుతో భిక్షాటన చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కిడ్నాప్ చేసిన జంట దోమకొండకు చెందిన పల్లపు రాజు, పల్లపు శారదగా పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. మూడు గంటల్లో బాబు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ ఎస్సై శ్రీరాం, సిబ్బంది పాల్గొన్నారు.