ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఫైనల్ సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్టుతో తుదిపోరులో, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ, ఈ క్రమంలో శిఖర్ ధావన్ను అధిగమించాడు.
మ్యాచ్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ఇద్దరూ 768 ఫోర్లతో సమంగా ఉన్నారు. అయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్లో భాగంగా నాలుగో ఓవర్లో పంజాబ్ బౌలర్ కైల్ జేమీసన్ వేసిన బంతిని బౌండరీకి తరలించడం ద్వారా కోహ్లీ ఈ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. గతేడాది అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో మొత్తం మూడు బౌండరీలతో 43 పరుగులు చేసిన కోహ్లీ, ఐపీఎల్లో 770కి పైగా ఫోర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.