బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో పార్టీలో కోవర్టులు ఉన్నారన్న ఆరోపణలు కలకలం రేపుతుండగా, ఈ వ్యవహారంపై సీపీఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ స్పందించారు. కవిత లేఖపై కేసీఆర్ తక్షణమే స్పందించాలని, బీజేపీ విషయంలో బీఆర్ఎస్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
శనివారం నాగర్కర్నూలులో పర్యటించిన జాన్ వెస్లీ, అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని, వారంతా కేసీఆర్ చుట్టూనే ఉన్నారని, వారిని గుర్తించి దూరం పెట్టకపోతే పార్టీ భవిష్యత్తుకు నష్టమని కవిత తన లేఖలో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేశారు. ఈ ఆరోపణలపై కేసీఆర్ మౌనం వీడి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని జాన్ వెస్లీ కోరారు.
అదే సమయంలో, బీజేపీ పట్ల బీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరిని కూడా ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని జాన్ వెస్లీ అభిప్రాయపడ్డారు. “ప్రాంతీయ పార్టీలను బీజేపీ విచ్ఛిన్నం చేస్తోంది. దేశంలో మతతత్వ రాజకీయాలను పెంచి పోషిస్తూ, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది” అని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో బీఆర్ఎస్ సానుకూలంగా వ్యవహరిస్తే, ఆ పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం ఏర్పడవచ్చని జాన్ వెస్లీ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని ఆయన కేసీఆర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.