కరోనా భయపెడుతోంది.. దేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇక విదేశాల విషయానికి వస్తే.. సింగపూర్, హాంకాంగ్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కొవిడ్ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కొవిడ్ కేసులపై దృష్టి సారించింది. కొవిడ్ నియంత్రణలోనే ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. హాంకాంగ్, సింగపూర్లో కోవిడ్ 19 కేసుల పెరుగుదలతో దేశంలో 257 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. హాంకాంగ్, సింగపూర్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ..ప్రస్తుతం భారత్ లో 257 యాక్టివ్ కేసులున్నాయని.. ఆందోళన అవసరం లేదని చెప్పింది. కోవిడ్ పరిణామాల దృష్ట్యా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన ఆరోగ్య విభాగాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR) విభాగం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు కోవిడ్ పరిస్థితులను సమీక్షించారు.
భారతదేశంలో ప్రస్తుత COVID-19 పరిస్థితి నియంత్రణలోనే ఉందని నిపుణులు తేల్చారు. దేశ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే కోవిడ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న కేసులన్నీ దాదాపుగా తేలికపాటివి, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), ICMR ద్వారా దేశంలో COVID-19 సహా శ్వాసకోశ వైరల్ వ్యాధుల పర్యవేక్షణకు బలమైన వ్యవస్థ కూడా ఉందని నిపుణులు చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించడంలో అప్రమత్తంగా ఉందని, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కొవిడ్ కొత్త కేసులు పెరుగుతున్నాయని చెప్పింది.
కోవిడ్-19 JN 1 వేరియంట్ లక్షణాలు ఇవే..
కోవిడ్-19 JN 1 వేరియంట్ కారణంగా రోగులకు జ్వరం, అలసట, తలనొప్పి గొంతు నొప్పి ఉన్నట్లు గుర్తించిన ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.