అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి బ్రేక్

V. Sai Krishna Reddy
2 Min Read

ప్రపంచ దేశాలకు, స్టాక్ మార్కెట్లకు కంటిమీద కునుకులేకుండా చేసిన అమెరికా మరియు చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇరు దేశాలు పోటాపోటీగా విధించుకున్న దిగుమతి సుంకాలను (టారిఫ్‌లను) తాత్కాలికంగా తగ్గించుకోవడానికి ఒక కీలక అవగాహనకు వచ్చాయి. స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది.

గత కొంతకాలంగా, వివిధ భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై భారీగా టారిఫ్‌లు విధించారు. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచుతూ వాణిజ్య యుద్ధానికి దిగింది. ఈ క్రమంలో ఉద్రిక్తతలు తీవ్రమై, అమెరికా చైనా ఉత్పత్తులపై తన టారిఫ్‌లను 145 శాతానికి పెంచగా, చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం సుంకాలు విధించింది. ఈ పరిణామం ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను కుదేలు చేయడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలను కూడా సృష్టించింది

ఈ నేపథ్యంలో, ఉద్రిక్తతలను తగ్గించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే లక్ష్యంతో అమెరికా – చైనా ప్రతినిధులు స్విట్జర్లాండ్‌ వేదికగా వాణిజ్య చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా టారిఫ్‌లను తాత్కాలికంగా వాయిదా వేయడంతో పాటు, వాటిని తగ్గించాలని నిర్ణయించారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ఒప్పందం 90 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ఈ కాలంలో ఇరు దేశాలు తమ టారిఫ్‌లను గణనీయంగా తగ్గిస్తాయి.

చైనా: అమెరికా దిగుమతులపై చైనా తన సుంకాలను ప్రస్తుతం ఉన్న 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తుంది. ఇది 115 శాతం పాయింట్ల తగ్గింపు. అమెరికా: చైనా దిగుమతులపై అమెరికా తన సుంకాలను ప్రస్తుతం ఉన్న 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గిస్తుంది. ఇది కూడా 115 శాతం పాయింట్ల తగ్గింపు. – నెక్ట్స్ ఏంటి? ఈ తాత్కాలిక ఒప్పందం ప్రపంచ వాణిజ్యానికి.. స్టాక్ మార్కెట్లకు కొంతకాలం పాటు ఉపశమనం కల్పించే అవకాశం ఉంది. రాబోయే 90 రోజుల్లో ఇరు దేశాలు మరిన్ని చర్చలు జరిపి, వాణిజ్య సంబంధాలపై శాశ్వత పరిష్కారం కనుగొంటాయో లేదో చూడాలి. ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *