బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ వేదికపై ప్రసంగించనున్నారు. జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ వార్షిక సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొనాలని నిర్వాహకులు ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే అంశంపై ఈ సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, ఆచార్యులతో పాటు వివిధ దేశాల నిపుణులు పాల్గొంటారు. భారతదేశ ప్రగతి ప్రస్థానం, తెలంగాణలో అమలు చేసిన వినూత్న విధానాలు, సాంకేతికత ఆధారిత అభివృద్ధి నమూనాపై కేటీఆర్ తన అనుభవాలను, ఆలోచనలను పంచుకోనున్నారు. యూరప్లో భారత్కు సంబంధించిన అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటైన ఈ ఫోరమ్, భారతదేశ పురోగతిని ప్రపంచానికి చాటే వేదికగా నిలుస్తుంది. కేటీఆర్ అనుభవాలు అంతర్జాతీయ నిపుణులకు, విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయని ఫోరమ్ వ్యవస్థాపకులు సిద్ధార్థ్ సేఠి ఆశాభావం వ్యక్తం చేశారు.