బసవతారకం ట్రస్ట్’ కేసులో లక్ష్మీపార్వతికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ

V. Sai Krishna Reddy
1 Min Read

వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ‘బసవతారకం ట్రస్ట్’కు తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 18 నవంబర్ 1995లో ఎన్టీఆర్ ఎగ్జిక్యూట్ చేసినట్టుగా పేర్కొన్న సప్లిమెంటరీ విల్లును నిరూపించే క్రమంలో సిటీ సివిల్ కోర్టు చట్టం నిర్దేశించిన ప్రొసీజర్‌ను అనుసరించలేదని స్పష్టం చేసింది. సప్లిమెంటరీ విల్లుపై సాక్షి సంతకం చేసిన జె.వెంకటసుబ్బయ్య వారసుడు జేవీ ప్రసాదరావును సాక్షి (పీడబ్ల్యూ 3)గా గుర్తిస్తూ దిగువ కోర్టు 2018లో ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. విల్లుపై సాక్షి సంతకాలు చేసిన వెంకటసుబ్బయ్య, వై. తిరుపతిరావు చనిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేకుండా వారి వారసులను సాక్షులుగా స్వీకరించడం చెల్లదని స్పష్టం చేసింది. వెంకట సుబ్బయ్య మరణించారన్న నోటి మాట ఆధారంగా ఆయన కుమారుడు జేవీ ప్రసాదరావును సాక్షిగా గుర్తించడం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది.

1995లో ఎన్టీఆర్ రాసిన సప్లిమెంటరీ విల్లు ప్రకారం బసవతారకం ట్రస్టుకు తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని 2009లో లక్ష్మీపార్వతి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. విల్లులో సంతకం చేసిన వెంకట సుబ్బయ్య మరణించిన నేపథ్యంలో ఆయన కుమారుడు ప్రసాదరావును సాక్షిగా గుర్తించాలని ఆ పిటిషన్‌లో లక్ష్మీ పార్వతి కోరారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ విల్లు నిజమేనని, తన తండ్రి వెంకట సుబ్బయ్య మరణించారని జేవీ ప్రసాదరావు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయనను సాక్షిగా విచారించేందుకు సివిల్ కోర్టు అంగీకరించింది. అయితే, ఈ ఆదేశాలను బసవతారకం ట్రస్ట్, నందమూరి బాలకృష్ణ 2019లో హైకోర్టులో సవాలు చేశారు. నిన్న విచారించిన న్యాయస్థానం దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *