జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు అన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో కలవరం రేపుతున్నాయి. ఇంతకీ వారు ఈ విధంగా ఎందుకు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్ అజెండా ఏమిటి వారి సమస్యలు ఏమిటి అసలు వారికి కావాల్సింది ఏమిటి అన్న చర్చ అయితే సాగుతోంది.
ఇదిలా ఉంటే ఏపీ శాసనసభ సమావేశాలు ముగిసీ ముగియడంతోనే జనసేన ఎమ్మెల్యేలు అంతా కలసి విజయవాడలో ఈ మీటింగ్ పెట్టుకున్నారని అంటున్నారు. ఈ సమావేశంలో జనసేన నంబర్ టూ నాయకుడు మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారని తెలుస్తోంది.
ఆయనకే ఈ విషయాలు అన్నీ జనసేన ఎమ్మెల్యేలు చెప్పుకున్నారని అంటున్నారు. తన నియోజకవర్గాలలో తగిన గౌరవం లేదని తమ మాట ఏ మాత్రం చెల్లుబాటు కావడం లేదని ఎమ్మెల్యేలుగా తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలి పోతున్నామని జనసేన ఎమ్మెల్యేలు వాపోయినట్లుగా చెబుతున్నారు. తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలలో టీడీపీ ఇంచార్జిలు ఉన్నారని వారిదే హవాగా సాగుతోందని అధికారుల వద్ద వారి మాటే చెల్లుతోందని కూడా చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు. జనసేన బలంగా ఉన్న చోట టీడీపీ ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారు అక్కడ తమదే అంతా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, కానీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం టీడీపీ ఇంచార్జిలదే పెత్తనం అంటే ఇదెక్కడి న్యాయం అని అంటున్నారు.