వనపర్తిలో నేడు ప్రజా పాలన-ప్రగతి బాట బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నా, కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో అధికార పీఠం నుంచి తన రహస్య మిత్రుడు దిగిపోయాడని కిషన్ రెడ్డి బాధపడుతున్నారని విమర్శించారు.
వరంగల్ ఎయిర్ పోర్టు ఇచ్చింది ప్రధాని మోదీ… కానీ ఎయిర్ పోర్టును తానే తెచ్చానని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
“మరి మెట్రో రాలేదు, మూసీ ప్రక్షాళనకు నిధులు రాలేదు… వీటిని ఆపింది ఎవరు? ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం తన వల్లే మంజూరు అయిందని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు… మరి దక్షిణభాగం ఎవరి వల్ల ఆగిపోయింది? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 60 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా… పదేళ్ల నుంచి పెండింగ్ లో ఉంది… దీన్ని ఆపింది ఎవరు?
ఏదైనా ప్రాజెక్టు వస్తేనేమో తన ఖాతాలో వేసుకుంటారు… రాకపోతే రేవంత్ రెడ్డి వైఫల్యం అంటారు. తన కంటే చిన్నోడు సీఎం అయ్యాడని కిషన్ రెడ్డికి కడుపుమంట” అంటూ రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు