చిన్నకోడూరు , మార్చి 14 , (ప్రజాజ్యోతి) : ఆస్తి రాసిచ్చిన తర్వాత కన్నతండ్రిని పట్టించుకోకుండా వేధించిన ఇద్దరు కొడుకులపై చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గంగాపూర్ గ్రామానికి చెందిన కొండి నారాయణరెడ్డి (94) తనకు ఉన్న 7 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులు రాజిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలకు సమానంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు.వృద్ధాప్యంలో తమను చూసుకుంటారని భావించిన ఆయనకు నిరాశే మిగిలింది. కొడుకులు తల్లిదండ్రులను పాత ఇంట్లో ఉంచి, కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వేధిస్తున్నారని నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే తిడుతూ, బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ మానవత్వంతో స్పందించి వృద్ధుడి ఇంటికే వెళ్లి ఫిర్యాదు స్వీకరించారు. వృద్ధులను వేధించడం చట్టరీత్యా నేరమని పేర్కొంటూ ఇద్దరు కొడుకులపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు.
