నర్సాపూర్ (ప్రజాజ్యోతి) నర్సాపూర్లోని బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా గత వారం రోజులుగా జరిగిన జాతీయ స్థాయి పోటీలు ఘనంగా ముగిశాయి. వాహనాల వేగం, సామర్థ్య పరీక్షల అనంతరం చివరి రోజు నిర్వహించిన ‘హెచ్ఆర్ మీట్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యాప్తంగా తరలివచ్చిన ప్రతిభావంతులైన యువ ఇంజనీర్లను ఒడిసిపట్టుకునేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడ్డాయి.
• బ్యాట్ పరీక్షతో సత్తా చాటిన విద్యార్థులు
ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు ‘బాజా అసెస్మెంట్ టెస్ట్’ నిర్వహించారు. విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానం, ఆప్టిట్యూడ్ మరియు సైకోమెట్రిక్ నైపుణ్యాలను ఈ పరీక్ష ద్వారా అంచనా వేశారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారిని షార్ట్లిస్ట్ చేసి.. గ్రూప్ డిస్కషన్లు, టెక్నికల్ మరియు హెచ్ఆర్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారు.
• ముందు వరుసలో దిగ్గజ సంస్థలు
ఈ నియామకాల్లో ఆటోమొబైల్ రంగంలోని అగ్రగామి సంస్థలైన జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్, టీవీఎస్ మోటార్ కంపెనీ, మరియు వారక్ ప్రతినిధులు పాల్గొన్నారు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడి విద్యార్థులు చూపిన ప్రతిభ అమోఘమని వారు కొనియాడారు.
• ఉపాధి అవకాశాలకు కేరాఫ్ బాజా
ఈ సందర్భంగా బాజా జాయింట్ కన్వీనర్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇదొక అద్భుత వేదిక అని తెలిపారు. విద్యార్థులు నేరుగా పరిశ్రమలో బాధ్యతలు చేపట్టేలా ఈ పోటీలు వారిని తీర్చిదిద్దుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాజా సలహాదారు డాక్టర్ కె.సి. వోరా, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దూబే, వివిధ కంపెనీల ప్రతినిధులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
