నేడే కేంద్ర బడ్జెట్ 2026: మధ్యతరగతి ఆశలు నెరవేరేనా?

V. Sai Krishna Reddy
2 Min Read

దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2026-27 తుది అంకం ఈరోజు ప్రారంభం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదో బడ్జెట్‌ను నేడు పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై విధించిన 50 శాతం టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించి, దేశ ఆర్థిక వృద్ధిని కాపాడటమే ఈ బడ్జెట్ ప్రధాన ఉద్దేశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈసారి బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త పన్ను విధానంలో కూడా సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు మినహాయింపు ఇస్తారని సామాన్యులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా, గృహ రుణాల వడ్డీపై ఇచ్చే మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు రావడమే కాకుండా, సొంతింటి కల కంటున్న మధ్యతరగతికి పెద్ద ఊరట లభిస్తుంది.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలకు ఈ బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు లేదా కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యోగాల కల్పనను వేగవంతం చేస్తూనే, ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచడం ఆర్థిక మంత్రికి కత్తి మీద సాములా మారింది. దేశీయ ఎలక్ట్రానిక్స్, ఈవీ వాహనాలపై రాయితీలు ఇచ్చి, విదేశీ లగ్జరీ కార్లు, దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రాణాపాయ పరిస్థితుల్లో వాడే మందులు, కీలకమైన వైద్య పరికరాలపై దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా సామాన్యులకు తక్కువ ధరకే వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. సబ్సిడీలను హేతుబద్ధీకరిస్తూనే, మౌలిక సదుపాయాలపై ఖర్చును పెంచడం ద్వారా ఆర్థిక రంగానికి ఊతం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. కాసేపట్లో ఆర్థిక మంత్రి రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి అనుమతి తీసుకున్న తర్వాత పార్లమెంట్‌కు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *