ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
శనివారం సాయంత్రం నారా లోకేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి దేశ రాజధాని దిల్లీకి చేరుకున్నారు. అనంతరం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం ప్రధానమంత్రి ఆహ్వానం మేరకే జరిగినట్లు తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించిన విషయం విదితమే. ఆ పర్యటన సందర్భంగా, నారా లోకేశ్ను దిల్లీ వచ్చి తనను కలవాల్సిందిగా ప్రధాని సూచించారు. ఈ నేపథ్యంలోనే, లోకేశ్ ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, లోకేశ్ దంపతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుమారుడు, చిన్నారి దేవాన్ష్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముచ్చటించారు. కుటుంబపరమైన విషయాలతో పాటు, ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు కూడా వీరిరువురి మధ్య చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.