పహల్గాం ప్రతీకారం: పాక్‌లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడ్డ భారత్ – “ఆపరేషన్ సిందూర్” సంచలనం

V. Sai Krishna Reddy
3 Min Read

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో రగులుతున్న భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్‌ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. “ఆపరేషన్ సిందూర్” పేరుతో చేపట్టిన ఈ చర్యతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

పహల్గాం దాడిలో అమరులైన వారికి న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన భారత్, ఆ దిశగా కఠిన చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:44 గంటల సమయంలో భారత ఆర్మీ, వాయుసేన, నౌకాదళాలు సంయుక్తంగా “ఆపరేషన్ సిందూర్”ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. అయితే, పాకిస్థాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు చేయలేదని, ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో ‘భారత్ మాతా కీ జై’ అంటూ పోస్టులు చేయడం గమనార్హం. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించగా, “న్యాయం జరిగింది” అని భారత సైన్యం ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది.

పాకిస్థాన్ స్పందన, ప్రతిచర్యలు:
భారత దాడులను పాకిస్థాన్ సైన్యం ధృవీకరించింది. పాక్ డీజీ ఐఎస్‌పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ, కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారని, మరో 12 మంది గాయపడ్డారని పాక్ ఆర్మీ ప్రకటించింది. సమయం చూసి భారత్‌కు తగిన రీతిలో బదులిస్తామని, “భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తాం” అని ఆయన హెచ్చరించారు.

భారత దాడులపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. “మోసపూరిత శత్రువు పాకిస్థాన్‌లోని ఐదు ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ చర్యలకు పాకిస్థాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్థాన్‌కు, ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం” అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ దాడులను ఆయన ‘యుద్ధ చర్య’గా అభివర్ణించారు. పాక్ ప్రధాని ప్రకటన అనంతరం, సరిహద్దులోని పూంఛ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడటంతో, భారత దళాలు కూడా ప్రతిగా కాల్పులు జరిపాయి. దీంతో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఒకటైన మురిడ్కే లష్కరే తొయిబా ఉగ్ర సంస్థకు ప్రధాన కేంద్రంగా ఉండగా, పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్‌లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్-ఎ-మహ్మద్ స్థావరం ఉంది.

అంతర్జాతీయ స్పందన, భద్రతా చర్యలు:
భారత్ దాడులతో అప్రమత్తమైన పాకిస్థాన్, లాహోర్, సియాల్‌కోట్ విమానాశ్రయాలను 48 గంటల పాటు మూసివేసింది. మరోవైపు, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియోతో ఫోన్‌లో మాట్లాడి, దాడుల సమాచారాన్ని వివరించినట్లు తెలిసింది. దాడుల అనంతరం భారత వాయు రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా నిలువరించేందుకు సరిహద్దుల వెంట ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థలను మోహరించారు. భారత్‌లోని శ్రీనగర్, జమ్ము, అమృత్‌సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను కూడా ముందు జాగ్రత్త చర్యగా మూసివేసినట్లు సమాచారం. బుధవారం ఉదయం 10.30 గంటలకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతీయ భద్రతా కమిటీతో సమావేశం కానున్నారు.

ఈ పరిణామాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఇండియా-పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉందని, ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు. “ఇది హేయమైన విషయం. వారు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారు. దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలి. ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు వద్దు” అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించ తలపెట్టిన తరుణంలో ఈ దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *