జూదంలో జాక్ పాట్ తో అమెరికా, ఆస్ట్రేలియాలో రాత్రికి రాత్రి కోటీశ్వరులైన వారి గురించి చదివాం.. జూదం, లాటరీ ఏదైనా కానీ.. కేవలం లక్ ఉంటేనే. ఆ లక్ అందరికీ ఎలా సాధ్యం. ఈ నేపథ్యంలోనే తమ లక్ ను పరీక్షించుకునేందుకు చాలామంది లక్షలు ఖర్చు పెడుతుంటారు. జూదం అనే ఆశల పల్లకీలో చివరకు ఆస్తులు కోల్పోయినవారూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అన్న ఎన్టీఆర్ సీఎంగా ఉండగానే ఉమ్మడి ఏపీలో లాటరీలపై నిషేధం విధించారు. మనషుల జీవితాలతో ఆడుకునే ఇలాంటి వాటిని.. కష్టే ఫలి అని మనసారా నమ్మే అన్న ఎన్టీఆర్ నిషేధించి మంచి పని చేశారు. 30 ఏళ్లలో మళ్లీ తెలుగు నాట లాటరీ మాట లేదు.
ఇప్పటికీ భారత దేశంలో కొన్ని రాష్ట్రాల్లో లాటరీలు కొనసాగుతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపై ఆధారపడి ఇదంతా సాగుతోంది. ఇక క్రికెట్ గురించి చెప్పుకొంటే.. డ్రీమ్ ఎలెవెన్ అని యాప్ నడుస్తోంది. చాలామంది ఇందులో జట్టును క్రియేట్ చేసి పందేలు వేస్తుంటారు. ఇలా పాపులర్ అయిన డ్రీమ్ ఎలెవెన్ లో యూపీ వాసి సరోజ్ కు లక్ గట్టిగా తగిలింది. ఏప్రిల్ 29న చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ పై రూ.39తో అతడు జట్టును క్రియేట్ చేయగా, రాత్రికి రాత్రే రూ.4 కోట్లు గెలిచాడు. దీన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అవుతోంది. ఇక తాను గెలిచిన సొమ్ములో కొంత భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలకు వాడతానని, మిగతా డబ్బుతో వ్యాపారం చేస్తానని సరోజ్ చెబుతున్నాడు. సరోజ్ ను చూసి బెట్ వేద్దామని అనుకునేరు.. అది మీకు సాధ్యం కాదు.. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల్లో డ్రీమ్ ఎలెవెన్ బ్యాన్.