భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. ఒకవేళ భారత్ దాడులకు పాల్పడితే, తాము ప్రతిదాడి చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవలి పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించిన నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాకిస్థాన్ పార్లమెంటు వెలుపల మాధ్యమాల ప్రతినిధులతో మాట్లాడుతూ ఖవాజా ఆసిఫ్ ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు. “పహల్గాం దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ప్రతిరోజూ ఉద్రిక్తత పెరుగుతూనే ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయి” అని దేశ భద్రతాపరమైన చర్యలపై అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. పలు దేశాలు శాంతి స్థాపనకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
“ఒకవేళ భారత్ మాపై దాడులకు పాల్పడితే, మేం తప్పకుండా ప్రతిదాడి చేస్తాం. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అది పూర్తిగా భారత్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది” అని ఆసిఫ్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో భారత్ తీవ్రమైన చర్యలు తీసుకుంటోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి భారత్ అంగీకరించే సూచనలు కనిపించడం లేదని ఆయన అన్నారు. “భారత వైఖరి పట్ల పాకిస్థాన్ కూడా అంతే గట్టిగా, ఊహించని విధంగా స్పందిస్తుంది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరాలని ఆ దేవుడినే ప్రార్థిస్తున్నాను” అని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు